జగ్గంపేట, జూలై 16:కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీ బలభద్రుని సమేత సుభద్రాదేవి–జగన్నాథస్వామి వారి రథయాత్ర మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి పోలిట్బ్యూరో సభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పాల్గొన్నారు. గురువారం ఉదయం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, పుష్పార్చనలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైన రథయాత్రలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షుడు జ్యోతుల నవీన్ స్వయంగా రథాన్ని లాగి భక్తులతో కలిసి పాల్గొన్నారు.తదనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని జగన్నాథస్వామి వారి దర్శనం చేసుకున్నారు. సాయంత్రం కోలాటాలు, భక్తి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజల సహకారంతో జగన్నాథ రథయాత్ర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.
