
పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: నూతనంగా ఏర్పాటైన పోలవరం జిల్లాలో తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రంపచోడవరం పర్యటించి , ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ ( ఎంపీటీఎం 4.0) కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఆయనతోపాటు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాల విద్యా కమిషనర్ తమీమ్ అన్సారియా, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరై ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడానికి జిల్లా యంత్రాంగం గత పది రోజులుగా అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తూ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంది. తల్లికి వందనం'పై వినూత్న డ్రోన్ ఎల్ఈడి వీడియో ప్రదర్శన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం ద్వారా అర్హులైన ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయాన్ని పారదర్శకంగా తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. ఈ పథకం విశేషాలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి పోలవరం జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో అత్యాధునిక డ్రోన్ సాంకేతికతతో ఎల్ఈడి డ్రోన్ వీడియో ప్రదర్శనను గురువారం సాయంత్రం నిర్వహించారు. సాయంత్రం 7.00 గంటలకు రంపచోడవరం అంబేద్కర్ సెంటర్ వద్ద, అనంతరం గిరిజన బాలుర సంక్షేమ వసతి గృహం, ముసురుమిల్లి, బోర్నగూడెం వద్ద ప్రత్యేక డ్రోన్ ఎల్ఈడి వీడియో ప్రదర్శన నిర్వహించారు. ఆకాశంలో డ్రోన్ల సహాయంతో రూపొందించే ఈ వినూత్న ప్రదర్శనలో 'తల్లికి వందనం' పథకం ముఖ్యాంశాలు, ప్రభుత్వం చేపట్టిన విద్యా సంక్షేమ కార్యక్రమాలు ఆకర్షణీయంగా ప్రదర్శించబడనున్నాయి. జిల్లా ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరై ఈ అరుదైన డ్రోన్ ఎల్ఈడి వీడియో ప్రదర్శనను వీక్షించాలని, అలాగే ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడంలో సహకరించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.