
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బుచ్చెంపేట సెక్టార్ పరిధిలోని రాజన్నపేట, అంట్లపాలెం, వీరపురాజుపేట, కె.నాయుడుపాలెం, ఎమ్.కే.పట్నం, నిండుగొండ 1, 2 గ్రామాలలో శనివారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రావికమతం సీడీపీఓ మంగతాయారు ఆదేశాల మేరకు అంగన్వాడీ సిబ్బంది ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతపై మహిళలకు వివరించారు. పుట్టిన వెంటనే శిశువుకు ముర్రుపాలు ఇవ్వడం అత్యంత అవసరమని, ఇది శిశువుల ఆరోగ్యానికి తోడ్పడటమే కాకుండా వారి ఐక్యూ స్థాయిని పెంచడంలో సహాయపడుతుందని తెలిపారు. అదేవిధంగా తల్లిపాలు ఇవ్వడం ద్వారా తల్లులకు రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని అవగాహన కల్పించారు.గ్రామాల్లో మహిళలు, గర్భిణీలు, బాలింతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన పొందారు.