
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం పీకే గూడెం గ్రామంలో శ్రీ తలుపులమ్మ తల్లి పండుగ సందర్భంగా భద్రతను మరింత పటిష్టం చేసేందుకు గ్రామస్తులు ముందడుగు వేశారు. ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని మూడు రోడ్ల జంక్షన్ వద్ద గ్రామ కమిటీ అధ్యక్షుడు గాడి వెంకటరమణ, నీటి సంఘం అధ్యక్షుడు అచ్యుత వెంకటరమణతో పాటు పలువురు నాయకులు స్వచ్ఛందంగా శాశ్వత సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకంగా పనిచేస్తాయని ఎస్ ఐ. తారకేశ్వరరావు తెలిపారు. నిఘా వ్యవస్థతో నేరాలను అరికట్టడంతో పాటు ఘటనలు జరిగినప్పుడు దర్యాప్తులోనూ సీసీ కెమెరాల ఫుటేజీ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ప్రతి గ్రామంలో యువత, నాయకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిఘా నేత్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని ఎస్సై తారకేశ్వరరావు పిలుపునిచ్చారు. పీకే గూడెం గ్రామస్తుల చొరవను ఆయన అభినందించారు.