
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం వై.బి. పట్నం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై తాపీ మేస్త్రీ తంగేళ్ల శ్రీనివాసరావు (37) మృతి చెందాడు. మృతుడు తుని మండలం మరువాడ గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.గ్రామానికి చెందిన గొల్లి అప్పారావు ఇంటి నిర్మాణ పనులను కాంట్రాక్టు తీసుకున్న శ్రీనివాసరావు, కూలీలు అందుబాటులో లేకపోవడంతో స్వయంగా పనులు చేస్తున్నాడు. ఇంట్లో వెలుతురు కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్ను పక్కకు తప్పించే క్రమంలో ప్రమాదవశాత్తు షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.తోటి మేస్త్రీలు వెంటనే సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని శ్రీనివాసరావు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఎస్సై తారకేశ్వరరావు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.