
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో రానున్న ఎన్నికల నేపథ్యంలో రోలుగుంట మండలంలోని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఎంపీడీఓ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మండలంలోని మొత్తం 43 పోలింగ్ కేంద్రాల పరిస్థితిపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించారు.పోలింగ్ కేంద్రాలకు శాశ్వత భవనాలు ఉన్నాయా, భవనాల పరిస్థితి ఎలా ఉంది, విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంప్ వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా అనే అంశాలపై ప్రతినిధుల నుంచి వివరాలు సేకరించారు. ఏదైనా కేంద్రంలో సౌకర్యాల లోపం, భవన మార్పు లేదా ఇతర అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని ఎంపీడీఓ సూచించారు.అందిన ఫిర్యాదులు, సూచనలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన మరమ్మతులు, మార్పులు, చేర్పులు చేపడతామని నాగేశ్వరరావు తెలిపారు. సమావేశంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు జీ. శాంబశివరావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చంద్ర, వైయస్సార్సీపి పార్టీ మండల అధ్యక్షుడు టీ.వీ. రమణ, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు బలిజ మహారాజు తదితరులు పాల్గొన్నారు.