మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి – పోలీసుల అవగాహన
జగ్గంపేట, ఆగస్టు 30: గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఆదివారం పోలీసులు, యువకులు, ప్రజల భాగస్వామ్యంతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధవ్ (IPS) ఉత్తర్వుల మేరకు, పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ ఆదేశాలతో జగ్గంపేట సీఐ బి. తిరుపతిరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జగ్గంపేట ఎస్సై టి. రఘునాథరావు, పోలీసు సిబ్బంది, జగ్గంపేటకు చెందిన యువకులు ర్యాలీలో పాల్గొన్నారు. జగ్గంపేటలోని పలు ప్రాంతాల్లో సైకిళ్లపై పర్యటిస్తూ గంజాయి, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు, ముఖ్యంగా యువతకు పోలీసులు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలకు బానిసలుగా మారి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ విద్య, ఉద్యోగం, క్రీడలు వంటి సానుకూల అంశాలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఎస్సై టి. రఘునాథరావు మాట్లాడుతూ జగ్గంపేట పరిధిలో ఎక్కడైనా గంజాయి లేదా డ్రగ్స్ను విక్రయించినా, సరఫరా చేసినా, రవాణా చేసినా లేదా వినియోగించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు, యువత పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ సైకిల్ ర్యాలీ ద్వారా “గంజాయికి దూరంగా ఉండండి – డ్రగ్స్కు నో చెప్పండి – ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోండి” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.

