
పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో భాగంగా సోమవారం ఆగస్టు 31న పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ను యథావిధిగా నిర్వహించనున్నట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రంపచోడవరంలోని స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ నిర్వహించి ప్రజల నుంచి

అర్జీలను స్వీకరిస్తామని తెలిపారు. తహశీల్దార్లు, ఏంపిడిఓ లు, ఇతర జిల్లా అధికారులు జిల్లా స్థాయిలో హాజరవ్వడం జరుగుతుందని తెలిపారు. తమ సమస్యలకు సంబంధించి అర్హత కలిగిన పత్రాలు, వివరాలతో ప్రజలు నేరుగా హాజరై అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి హాజరు కాలేని వారు కూడా తమ సమస్యలను 1100 టోల్ఫ్రీ నంబర్ ద్వారా తెలియ జేయవచ్చని, అలాగే మీకోసం వెబ్సైట్ (meekosam.ap.gov.in) లో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులను నమోదు చేసుకునే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటికే సమర్పించిన అర్జీల పరిస్థితి, పరిష్కార పురోగతిని తెలుసుకునేందుకు కూడా 1100 నంబర్ను వినియోగించుకోవచ్చని తెలిపారు. పీజీఆర్ఎస్ సేవలను మరింత పారదర్శకంగా, జవాబుదారీతనం తో అందించేందుకు సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ను జిల్లా, మండల స్థాయి కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. సంబంధిత సేవలను పొందిన అనంతరం మొబైల్ ఫోన్తో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ప్రజలు తమ అనుభవం, అభిప్రాయాలను నమోదు చేయాలని కోరారు. పీజీఆర్ఎస్లో పరిష్కరించిన ఫిర్యాదులపై ప్రజల నుంచి వచ్చే అసంతృప్తి స్పందనలను జిల్లా స్థాయిలో సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారులతో సంబంధిత అధికారులు నేరుగా మాట్లాడి సమస్య స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకుని, సంతృప్తికరమైన పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం, 1100 కాల్ సెంటర్, సూపర్ ఆడిట్ తదితర మార్గాల ద్వారా గుర్తించే అసంతృప్తి ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం లేదా విధి నిర్వహణలో లోపాలు ఉన్నట్లు తేలితే బాధ్యులైన అధికారులపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడంతో పాటు, చేపట్టిన చర్యల నివేదిక ( ఏటీఆర్) ను సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా 9552300009 వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ ద్వారా కూడా పౌర సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు అందుబాటులో ఉన్న ఈ వివిధ మార్గాలను వినియోగించుకుని తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందాలని కలెక్టర్ కోరారు.