
పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: గిరిజన మహిళా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా జిల్లాలో వెదురు సాగును ప్రోత్సహించేందుకు డీఆర్డీఏ–సెర్ప్ ఆధ్వర్యంలో వెదురు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ డి. రత్నాకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వెదురు ఉపరంగ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సుమారు 10 వేల మంది మహిళా రైతులకు 6 లక్షల వెదురు మొక్కలను పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఖాళీగా ఉన్న భూముల్లో వెదురు సాగు చేపట్టి మహిళా రైతులు అదనపు ఆదాయం పొందేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో మహిళా రైతుకు సుమారు 37 సెంట్ల భూమిలో 60 మొక్కలు నాటుకునేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. మొక్కల నాటడం, గుంతల ఏర్పాటు, కంచె, సంరక్షణ వంటి పనులకు రెండేళ్ల పాటు అవసరమైన సహకారం అందించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఆగస్టు 31న సోమవారం ఉదయం 9.30 గంటలకు రంపచోడవరం ఎంఎంఎస్ కార్యాలయంలో శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు .ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటీ చైర్పర్సన్ రంపచోడవరం నియోజకవర్గ శాసన సభ్యురాలు మిరియాల శిరీషా దేవి, ఏపీ ఎస్టి కమిషన్ చైర్పర్సన్ సొళ్ళ బొజ్జి రెడ్డి, పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్. ప్రశాంత్ కుమార్ తదితరులు హాజరుకానున్నారు. మొదటి విడత పంపిణీ అనంతరం ఆయా మండల కేంద్రాల్లో వెలుగు డీపీఎంలు, ఏపీఎంల ద్వారా మహిళా రైతులకు వెదురు మొక్కలను అందజేయనున్నట్లు డీఆర్డీఏ పీడీ రత్నాకర్ తెలిపారు.