పాయకరావుపేటలో గురువారం నిర్వహించనున్న జలహారతి కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రోలుగుంట మండలంలోని 24 పంచాయతీల నుంచి టీడీపీ శ్రేణులు బయలుదేరాయి.మండలంలోని 24 పంచాయతీల నుంచి సుమారు 24 బస్సుల్లో 1,200 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి తరలివెళ్లారు. ప్రతి గ్రామం నుంచి సుమారు 50 మంది చొప్పున నాయకులు, కార్యకర్తలు పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.జలహారతి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా పాయకరావుపేటకు బయలుదేరినట్లు రోలుగుంట టీడీపీ మండల అధ్యక్షుడు పంచాడ చంద్ర, ఎంపీటీసీ సుర్ల రామకృష్ణ, మాజీ మండల అధ్యక్షుడు గుమ్ములూరి చంద్రమౌళి తెలిపారు. కార్యక్రమానికి మండలంలోని అన్ని పంచాయతీల నుంచి కార్యకర్తలతో పాటు ఎక్కువగా మహిళలు తరలిరావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
