కోటనందూరు జిల్లా వాణి ప్రతినిధి
కాకినాడ జిల్లా, కోటనందూరు మండల పరిధిలో ఒక మైనర్ బాలికకు వివాహం జరిపించిన ఘటనపై కోటనందూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మైనర్ బాలికకు వివాహం జరగబోతున్నట్లు ముందస్తు సమాచారం అందడంతో సంబంధిత గ్రామ సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి, అంగన్వాడీ సిబ్బంది, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు మరియు చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బంది బాలిక కుటుంబ సభ్యులను సంప్రదించి, మైనర్ బాలికకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టంగా తెలియజేసి, వివాహం జరపవద్దని కౌన్సెలింగ్ చేయడంతో పాటు సంబంధిత అధికారుల ద్వారా నోటీసు కూడా అందజేశారు.
అంతేకాకుండా మైనర్ బాలికకు వివాహం జరపబోమని కుటుంబ సభ్యుల నుండి రాతపూర్వక హామీ కూడా తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ 30.08.2026 తేదీన బాల్య వివాహం జరిగినట్లు సమాచారం మరియు సంబంధిత ఫోటోలు అధికారుల దృష్టికి రావడంతో, విషయాన్ని పరిశీలించి కోటనందూరు పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాల్య వివాహం చేయడం, చేయించడం, ప్రోత్సహించడం, సహకరించడం లేదా తెలిసి కూడా అడ్డుకోకుండా ఉండడం చట్టరీత్యా నేరం. మైనర్ బాలికలు లేదా బాలురకు వివాహం జరిపించే తల్లిదండ్రులు, బంధువులు, మధ్యవర్తులు, వివాహ నిర్వాహకులు మరియు సహకరించే ఇతర వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని.
ఎవరైనా తమ గ్రామం లేదా పరిసర ప్రాంతాల్లో బాల్య వివాహం జరగబోతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు, చైల్డ్ హెల్ప్లైన్ లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని బాల్య వివాహాలను అడ్డుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఎస్సై రామకృష్ణ తెలియజేశారు.
“మైనర్ పిల్లలకు వివాహాలు జరిపించవద్దు. బాల్య వివాహాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని” ఎస్సై హెచ్చరించారు.
