అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రోంగలపాలెం పంచాయతీ శివారు కాముడిపాలెం గ్రామానికి శాశ్వత రహదారి నిర్మాణం చేపట్టేందుకు చర్యలు ప్రారంభమవుతున్నాయి. ఈ మేరకు జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పివిఎస్ఎన్ రాజు గ్రామాన్ని సందర్శించి, స్థానికులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు గండి సింహాద్రి పలు మార్లు కాముడిపాలెం నుంచి చెట్టుపల్లి గ్రామానికి బీటీ లేదా సీసీ రహదారి నిర్మించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, అత్యవసర వైద్య అవసరాల కోసం వెళ్లే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజల సమస్యలు విన్న అనంతరం, ఈ ప్రాంతానికి రహదారి అత్యవసర అవసరమని తేలిందని ఆయన చెప్పారు. రహదారి నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజల జీవన విధానం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు.ఈ విషయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి సమగ్రంగా తీసుకువెళ్లి, రహదారి నిర్మాణానికి అనుమతి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. దశాబ్దాలుగా అభివృద్ధి లేక వెనుకబడిన ఈ గ్రామానికి శాశ్వత రహదారి కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.త్వరలోనే పంచాయతీరాజ్ శాఖ అనుమతులతో పనులు ప్రారంభించి, కాముడిపాలెం నుంచి చెట్టుపల్లి వరకు రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు గండి సింహాద్రి తనయుడు తాతాజీ నాయుడు ప్రసాద్ శ్రీను స్థానిక నాయకులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.
