అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కుసర్లపూడిలో జనసేన కార్యకర్తల షాపులను ఖాళీ చేయించాలని అధికారులు చర్యలు తీసుకోవడం తీవ్రంగా ఖండనీయమని చోడవరం నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ పీవీఎస్ఎన్ రాజు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.కుసర్లపూడిలో జనసేన కార్యకర్తలకు చెందిన షాపులను లక్ష్యంగా చేసుకుని, వైసీపీ ఒత్తిడితో అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని పక్కనబెట్టి సోమవారం వేలం నిర్వహించాలనుకోవడం పూర్తిగా చట్టవిరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అధికారులు, రాజకీయ ఒత్తిడులకు లోనై చట్టాన్ని ధిక్కరించడం దురదృష్టకరమని రాజు విమర్శించారు. వెంటనే ఈ వేలాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.లేదంటే వచ్చే పరిణామాలకు సంబంధిత అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైతే పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు.జనసేన కార్యకర్తల హక్కులను కాపాడటంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయబోమని పీవీఎస్ఎన్ రాజు తేల్చి చెప్పారు.
