పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: పోలవరం జిల్లాలో అంగన్వాడి కేంద్రాలలో బాల బాలికలకు, గర్భిణీ స్త్రీలకు ఎప్పటికప్పుడు వేడివేడిగా ఆహార పదార్థాలు తయారుచేసి అందించే విధంగా ఎలక్ట్రికల్ స్టవ్లు ఫై అంగన్వాడి టీచర్లకు అవగాహన కల్పించడం జరిగిందని పోలవరం జిల్లా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. ఉమా పేర్కొన్నారు. సోమవారం జిల్లా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ వారి ఆధ్వర్యంలో అన్ని అంగన్వాడి కేంద్రాలకు ఎలక్ట్రికల్ స్టవ్లు, కుక్కర్లు వాడకంపై రంపచోడవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడి టీచర్లకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ పోలవరం జిల్లాలోని 8 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ప్రతి అంగన్వాడి కేంద్రంలో బాల బాలికలు, గర్భిణీలకు, బాలింతలకు ప్రతిరోజు నాణ్యమైన వేడివేడి ఆహారాన్ని త్వరగా, శుభ్రంగా అందించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రికల్ స్టవ్లు, ఎలక్ట్రికల్ కుక్కర్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె అన్నారు. వీటిని సక్రముగా వినియోగించడం ద్వారా సమయం ఆదా కావడంతో పాటు ఇంధన వినియోగం తగ్గి వంట ప్రక్రియ మరింత సురక్షితంగా ఉంటుందని ఆమె అన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రికల్ స్టవ్లు, కుక్కర్లను ఆన్ ఆఫ్ చేసే విధానం ఉష్ణోగ్రత నియంత్రణ వంట సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు విద్యుత్ భద్రత నియమాలు నిర్వహణ, చిన్నపాటి సమస్యలను గుర్తించి పరిష్కరించే పద్ధతులపై అవగాహన కల్పించడం జరిగిందని ఆమె అన్నారు. ప్రతి అంగన్వాడి కేంద్రంలో ఈ పరికరాలు జాగ్రత్తగా ఉపయోగించి సురక్షితమైన ఆహారాన్ని అందించాలని ఆమె అన్నారు. ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ఆమె అన్నారు. పోలవరం జిల్లాలో 985 ఎలక్ట్రిక్ స్టవ్వులు,985 కుక్కర్లు అంగన్వాడి కేంద్రాలలో ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు రాఘవ, గౌతమి, జయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
