. నాయుడుపాలెం అంబేద్కర్ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణదళిత కాలనీ సమస్యలపై అధికారులకు వినతులు.
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జే. నాయుడుపాలెం గ్రామంలోని అంబేద్కర్ కాలనీలో శుక్రవారం పౌర హక్కుల దినోత్సవాన్ని ప్రభుత్వం వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించింది. కార్యక్రమంలో రోలుగుంట డీటీ, పంచాయతీ కార్యదర్శి, పోలీసు శాఖ ప్రతినిధులు, మాజీ ఎంపీటీసీ కిల్లాడ నాయుడు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధికారులు దళిత కాలనీలో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి మాట్లాడుతూ కాలనీలో నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హాల్ పూర్తికాక పెండింగ్లో ఉందని, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. అలాగే అంబేద్కర్ విగ్రహం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, తాగునీటి బోర్లు సరిగా పనిచేయడం లేదని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.అనంతరం ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ జిల్లా సభ్యులు గాతాడ సహదేవుడు మాట్లాడుతూ దళిత కాలనీలోని సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకే ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కాలనీలో ఉన్న సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డెన్ రాము, స్థానిక దళిత సంఘం నాయకులు కాళ్ల రాజబాబు, రాము, తనికెళ్ళ చినరాజు, రమణమ్మ, సూర్యకాంతం తదితరులు పాల్గొన్నారు.
