పోలవరం జిల్లావాణీ ప్రతినిధి:గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశాల దృష్ట్యా ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఎక్కడైనా సమస్య తలెత్తిన వెంటనే సంబంధిత అధికారులు గ్రూపుల్లో సమాచారం పోస్ట్ చేయాలని, సమస్య పరిష్కారం కాకపోతే తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నీటిమట్టం ఈ రాత్రి నుంచి పెరిగే అవకాశం ఉన్నందున ముంపు ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు పంపిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితిని నిరంతరం తెలియజేయాలని సూచించారు. నీటిమట్టం 56 అడుగులకు చేరుకునే పరిస్థితి ఉంటే ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసి, అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ముంపు ప్రభావిత పాయింట్ల వద్ద నిత్యావసర సరుకులను ఈరోజు రాత్రికే నిల్వ చేయాలని, అవసరమైన ఇండెంట్లను వెంటనే సేకరించి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. బంగాళాదుంప, ఉల్లిపాయ వంటి వస్తువుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అదనంగా 20 నుంచి 30 శాతం బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంచాలని దినేష్ కుమార్ తెలిపారు. అర్హత కలిగిన కుటుంబాలకు రేషన్ సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పూర్తిస్థాయిలో విధుల్లో ఉండేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని, లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని అందజేసి తగిన అంగీకార పత్రాలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ముంపు ప్రభావం లేకపోయినా రేపు ఉదయం పరిస్థితి మారే అవకాశం ఉందని, అందువల్ల ముందస్తుగా అత్యవసర నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు..క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ప్రతి అధికారి, సిబ్బంది అత్యంత అప్రమత్తతతో పని చేయాలని స్పష్టం చేశారు. ఈ టెలీకాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ ఎస్. ప్రశాంత్ కుమార్, సబ్ కలెక్టర్/పి.ఓ. ఐటిడిఎ శుభం నొక్వల్, జిల్లా రెవెన్యూ అధికారి అంబేద్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
