అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం క్రీడా పోటీల్లో మాకవరపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 2026 సంవత్సరానికి స్పోర్ట్స్ కోటాలో వేలాది మంది విద్యార్థులు పోటీ పడినప్పటికీ, మాకవరపాలెం జడ్పీ పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సాధించారు.విద్యార్థుల విజయానికి వ్యాయామ ఉపాధ్యాయుడు రవి చేసిన కృషి కీలకంగా నిలిచింది. క్రమశిక్షణతో శిక్షణ అందించి విద్యార్థులను పోటీలకు సిద్ధం చేయడంపై తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతిని డీఈవో చేతుల మీదుగా అందుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు.విద్యార్థుల విజయంపై పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు చంద్రదేవి, నాయుడుతో పాటు తోటి ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని క్రీడా విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
