పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: ఓటర్ల జాబితాపై క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణకు మరో అవకాశం క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణకు తుది గడువు పొడిగించిన నేపథ్యంలో 2026 సెప్టెంబర్ 5, 6 తేదీలను అదనపు ప్రత్యేక ప్రచార దినాలుగా నిర్వహించనున్నట్లు పోలవరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె. దినేష్ కుమార్

గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రెండు రోజుల్లో ఆయా పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు (బి ఎల్ ఓ లు ), రాజకీయ పార్టీలు నియమించిన బూత్ స్థాయి ఏజెంట్లతో కలిసి అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఓటర్లు తమ పేర్లు, వివరాలను ఓటర్ల జాబితాలో పరిశీలించుకుని, అవసరమైన సవరణలు గుర్తించి సంబంధిత దరఖాస్తులను సమర్పించవచ్చన్నారు. దరఖాస్తులను స్వీకరించడంతో పాటు దరఖాస్తుదారులకు అధికారులు మార్గదర్శనం చేసి, వారి సందేహాలను నివృత్తి చేస్తారని తెలిపారు. అదనపు ప్రత్యేక ప్రచార దినాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద లేదా సంబంధిత ప్రాంతాల్లో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓల ఆధ్వర్యంలో విచారణలు నిర్వహించేం దుకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. సెప్టెంబర్ 5, 6 ఈ రెండు రోజుల కార్యక్రమంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడంతో పాటు అన్ని ఈఆర్ఓ లు, ఏ ఈఆర్ఓలు, బి ఎల్ వో లకు అవసరమైన సూచనలు జారీ చేయాలని, జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన అన్ని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలకు కూడా సమాచారం అందించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక ప్రచార దినాలు ముగిసిన అనంతరం నిర్దేశిత ఫార్మాట్లో నివేదిక సమర్పించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్ల జాబితాలో తమ వివరాలను పరిశీలించుకోవాలని, అవసరమైన క్లెయిమ్లు, అభ్యంతరాలు లేదా సవరణలకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించాలని కలెక్టర్ కె దినేష్ కుమార్ కోరారు.
