చింతపల్లి జిల్లావాణి ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయ జీవోను వెంటనే జారీ చేసి, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని నిరుద్యోగుల సంఘం కన్వీనర్ సాగిన సత్యనారాయణ పడాల్ డిమాండ్ చేశారు. అలాగే, 1/70 చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని వెంటనే ప్రకటించాలని ఆయన కోరారు. అదేవిధంగా అల్లూరి జిల్లాను జోన్–1లోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం శుక్రవారం (జూలై 17) ఉదయం 10 గంటల నుంచి పాడేరు జూనియర్ కళాశాల మైదానం నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివాసుల హక్కులు, భవిష్యత్ తరాల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆదివాసులు, నిరుద్యోగ యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
