పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనను విజయవంతం చేసిన అన్ని శాఖల అధికారులకు పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ అభినందనలు తెలిపారు. శనివారం రంపచోడవరంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి పర్యటన నిర్వహణలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులతో అభినందన సమావేశాన్ని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, గత పది రోజులుగా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా, సమన్వయంతో నిర్వహించిన ప్రతి అధికారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. పర్యటన సందర్భంగా ప్రజలు వినతిపత్రాల ద్వారా ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అడ్డతీగల నుంచి గోంటువానిపాలెం వరకు రహదారి అభివృద్ధి, కొత్త పింఛన్ల మంజూరు, మారేడుమిల్లి మండలంలోని మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం, అడ్డతీగల గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, రంపచోడవరం పట్టణంలో రోడ్డు విస్తరణ వంటి అంశాలపై

సమగ్ర నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. పోలవరం జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పింఛన్లు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు నిరంతర చర్యలు కొనసాగించా లని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను ప్రాధాన్యతతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జాతీయ రహదారులకు సంబంధించిన ప్రతిపాదనలపై నివేదికలు సిద్ధం చేయాలని, ‘తల్లికి వందనం’ పథకం అమలును వేగవంతం చేయాలని, అర్హులైన ఆడపడుచుల గృహాలకు పీఎం సూర్యఘర్ సోలార్ వ్యవస్థల ఏర్పాటు కోసం చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాలల్లో చిన్నారులు, పెద్ద పిల్లలకు వేర్వేరు పరిమాణాల్లో చెక్కిళ్లు (డెస్కులు/ఫర్నిచర్) అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మారు మూల గ్రామాలకు మొబైల్ నెట్వర్క్ సౌకర్యం కల్పించేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జాయింట్

కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, నూతన పోలవరం జిల్లా అభివృద్ధి బాధ్యత ప్రతి శాఖపై ఉందన్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసిన అన్ని శాఖల అధికారులను అభినందిస్తూ, ప్రభుత్వ ఆమోదం పొందిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి. అంబేద్కర్, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అహ్మద్ షరీఫ్, డీపీఓ రాజేష్ కుమార్, డీఎంహెచ్వో డా. పి. సరిత, ఐసీడీఎస్ పీడీ కె. ఉమా, డీఎంఓ భాస్కర్ రావు, డీసీహెచ్ఎస్ సాంబశివరావు, డీఆర్డీఏ పీడీ డా. దాసరి రత్నాకరరావు, డ్వామా పీడీ బి. రాంప్రసాద్, జిల్లా సివిల్ సప్లై అధికారులు బి. గణేష్ కుమార్, విజయభాస్కర్, సర్వే ఏడీ శ్రీనివాసరావు, సమాచార శాఖ ఏపీఆర్వో భవాని శంకర్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి దేవదానం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామ్మోహన్రావు, జిల్లా మత్స్యశాఖ అధికారిణి దిల్షాద్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
