జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆర్ ఎ ఆర్ ఎస్ శాస్త్రవేత్తలు సూచించారు.మంగళవారం అడ్డసారం, కొమరవోలు గ్రామాల్లో ఆర్ ఎ ఆర్ ఎస్ శాస్త్రవేత్తలు క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా వరి నారుమడులను పరిశీలించి, ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై రైతులకు పలు సూచనలు చేశారు.వర్షాలు మరింత ఆలస్యమైతే సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా తగిన వర్షపాతం లేకపోతే రాగులు, కందులు, సజ్జలు వంటి తక్కువ నీటితో సాగు చేసే ఆరుతడి పంటలను ఎంపిక చేసుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు తెలిపారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఎ ఆర్ ఎస్ శాస్త్రవేత్తలు డా. అప్పలస్వామి, డా. రవికుమార్, మండల వ్యవసాయ అధికారి చిరంజీవి, గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు. పంటల సాగుపై రైతులకు ఏవైనా సందేహాలు ఉంటే సమీపంలోని వ్యవసాయ అధికారులను సంప్రదించాలని మండల వ్యవసాయ అధికారి చిరంజీవి కోరారు.
