జగ్గంపేట, ఆగస్టు 15: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో సీయోను ప్రార్థనా మందిరం వద్ద పాస్టర్ సబ్జా డేవిడ్ రాజు ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా నాయకులు జుత్తుక నాగేశ్వరరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డానియల్ కృపావరం మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ తదితరులతో పాటు అనేకమంది క్రైస్తవులు కూడా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని తమ వంతు పాత్ర పోషించారని తెలిపారు.జాన్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, అనేకమంది పోరాట యోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. అన్ని మతాల ప్రజలు స్వేచ్ఛగా, సమానత్వం, సౌభ్రాతృత్వంతో కలిసి జీవించినప్పుడే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.జీవన్ కుమార్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయినా దేశంలో మతకలహాలు చోటుచేసుకోవడం ఆందోళనకరమన్నారు. అన్ని మతాల ప్రజలు భారతమాత ఒడిలో ఐక్యంగా జీవించినప్పుడే సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించినట్లవుతుందని పేర్కొన్నారు. అలాగే మహిళలు అర్ధరాత్రి సైతం స్వేచ్ఛగా, భద్రంగా ఒంటరిగా తిరగగలిగే పరిస్థితి రావాలని, అప్పుడే గాంధీజీ కలలుగన్న నిజమైన స్వాతంత్ర్యం సాకారమవుతుందని అన్నారు.దేశంలో ఇంకా వెనుకబాటుతనం, అసమానతలు, మత విభేదాలు వంటి సమస్యలను అధిగమించి సమానత్వం, శాంతి, సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు.


