అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో బడి ఈడు పిల్లల వివరాల సేకరణకు విద్యాశాఖ చేపట్టిన సర్వే వేగంగా కొనసాగుతోంది. జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ సర్వేలో సమగ్ర శిక్ష సీఆర్ఎమ్టీలైన పూడి వెంకట్రావు, పరవాడ సతీష్ కొవ్వూరు, నిండుగొండ సచివాలయాల పరిధిలోని గ్రామాలను సందర్శించి లీప్ యాప్లో నమోదైన బడి ఈడు పిల్లల వివరాలను ధృవీకరిస్తూ, తాజా సమాచారాన్ని యాప్లో అప్లోడ్ చేస్తున్నారు.ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు జాన్ ప్రసాద్, జగ్గారావు మాట్లాడుతూ రోలుగుంట మండలంలో బడి ఈడు పిల్లల సర్వే ఇప్పటికే 95 శాతం పూర్తయిందని తెలిపారు. సర్వేలో భాగంగా అనేక కుటుంబాలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి అక్కడే తమ పిల్లలను చదివిస్తున్నట్లు గుర్తించామని వెల్లడించారు.అలాగే, లీప్ యాప్లోని జాబితాలో వయసు మీరిన వారి పేర్లు, మరణించిన వ్యక్తుల వివరాలు కూడా ఉన్నట్లు సర్వేలో నిర్ధారణ కావడంతో వాటిని సవరించే ప్రక్రియ కొనసాగుతోందని సీఆర్ఎమ్టీలైన వెంకట్రావు, సతీష్ తెలిపారు.ప్రస్తుతం నిండుగొండ గ్రామంలో సీఆర్ఎమ్టీలు ఇంటింటికీ వెళ్లి బడి ఈడు పిల్లల వివరాలను సేకరిస్తూ సర్వేను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.
