అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో రావికమతం ప్రాజెక్టు బుచ్చంపేట సెక్టార్ వడ్డీప గ్రామంలో మంగళవారం తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా, అంగన్వాడీ సిబ్బంది, మహిళలకు తల్లిపాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై వివరించారు.జననం అయిన వెంటనే శిశువుకు తల్లిపాలు ఇవ్వడం, తొలి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలే అందించడం, అనంతరం పోషకాహారంతో పాటు రెండేళ్ల వరకు తల్లిపాలు కొనసాగించడం వల్ల శిశువుల ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా తల్లిపాలపై అవగాహన కల్పించే ఫ్లకార్డును ప్రదర్శించి, గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా తల్లిపాలను అందించాలని సూచించారు. తల్లిపాలే శిశువుకు సంపూర్ణ ఆహారమని, తల్లి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని వివరించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్.రమణమ్మ, మంగ, యర్రయ్యమ్మ, ఆర్.ఎస్.ఆర్. కుమారి, సత్యవతి, ఎటెండర్ పద్మ, కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, మహిళలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.
