
ఎలమంచిలి, ఆగస్టు 7: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎలమంచిలిలో కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
సీపీఐ నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను వివరించారు.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తూ, ప్రజల హక్కులను కాలరాస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని విమర్శించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం వంటి సమస్యలకు కేంద్ర ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణమని అన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం, కార్మికులు, రైతులు, పేదలు, సామాన్య ప్రజల ప్రయోజనాలను విస్మరించడం సరికాదన్నారు. దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విడనాడాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువల కాపాడటం, నిరుద్యోగ సమస్య పరిష్కారం, ధరల నియంత్రణ, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని రాజాన దొరబాబు పిలుపునిచ్చారు. సీపీఐ చేపడుతున్న ఈ ప్రచార కార్యక్రమాన్ని గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా నిర్వహించి ప్రజలను చైతన్యపరుస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సన్యాసిరావు , ఫణీంద్ర, జిల్లా సమితి నాయకులు, అర్జున్ ,అజయ్ ఏఐటియుసి నాయకులు జేసుదాసు కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
