జగ్గంపేట, ఆగస్టు 15: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జగ్గంపేట శ్రీ ప్రజ్ఞ విద్యా సంస్థల్లో స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ బండారు నాగబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల టీడీపీ అధ్యక్షులు, జేవీఆర్ గ్రూప్స్ అధినేత జీను మణిబాబు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జీను మణిబాబు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. దేశ చరిత్రతో పాటు స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన మహనీయుల జీవిత చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థులు, యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని, ఉత్తమ విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగడంతో పాటు దేశభక్తిని అలవర్చుకోవాలని ఆకాంక్షించారు.అనంతరం వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జీను మణిబాబు బహుమతులు అందజేశారు. విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తుమ్మల శ్వేత, ఎలిశెట్టి బుజ్జి, ప్రిన్సిపాల్ కె. అభి, ఇన్చార్జ్ కొల్లా శ్రీనివాస్, పులిగ పవన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


