
నక్కపల్లి,జిల్లావాణి ప్రతినిధి
ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీలో భాగంగా ఈ విద్యాసంవత్సరం కాలానికి 11 అకడమిక్ ఇన్ స్ట్రక్టర్ల పోస్టులు మంజూరు చేసినట్లు స్ధానిక మండల విద్యాశాఖాధికారి కె.నరేష్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా యున్న మూడు బయాలజీ, ఎనిమిది హిందీ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీచేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, హిందీ పోస్టులకు ఎంపిక విషయంలో టెట్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినవారికి ప్రధమ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని, లేని ఎడల గ్రాడ్యుయేషన్ చేసిన వారికి అవకాశం కల్పిస్తామన్నారు.ఎంపికయిన అకడమిక్ ఇన్ స్ట్రక్టర్లకు నెలకు ప్రభుత్వం తరపున 12,500 పారితోషకం ఇవ్వబడుతుందని ,2026 ఏప్రియల్ నెలతో వీరి కాలపరిమితి ముగుస్తుందని,ఆయన పేర్కొన్నారు.ఈనెల 21 వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, ఆసక్తి గల అభ్యర్ధులు స్ధానిక మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో కార్యాలయ పనివేళలలో సంప్రదించాలని ఎం.ఈ.వో.కే.నరేష్ తెలిపారు.
