అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమవడం స్థానికంగా ఆందోళనకు గురిచేసింది. మండలానికి చెందిన కుప్పా రమణమ్మ (32) ఆదివారం ఉదయం తన పిల్లలు చైతన్య (14), జోస్న (12)లతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది.ఆ సమయంలో ఆమె భర్త రాంబాబు కూలీ పనికి వెళ్లి ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి సభ్యులు విషయం తెలుసుకుని వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. రమణమ్మ నర్సీపట్నం డిపోలో బస్సు ఎక్కినట్లు సమాచారం లభించినప్పటికీ, ఆ తర్వాత వారి ఆచూకీ గురించి ఎలాంటి సమాచారం అందలేదు.ఇక రమణమ్మ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్గా ఉండటం కుటుంబ సభ్యుల్లో మరింత ఆందోళనను కలిగిస్తోంది. బంధువుల ఇళ్లలో కూడా వెతికినా వారి జాడ తెలియకపోవడంతో, భర్త రాంబాబు రోలుగుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
