
చింతపల్లి జిల్లా వాణి ప్రతినిధి: అల్లూరి జిల్లా చింతపల్లి సబ్ డివిజన్ డీఎస్పీగా సిహెచ్ తిరుపతిరావు గురువారం లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. 1996 బ్యాచ్లో ఎస్సైగా పోలీస్ శాఖలో అడుగుపెట్టిన ఆయన ఉత్తరాంధ్రలోని పలుచోట్ల ఎస్సైగా, స్పెషల్ బ్రాంచ్ సీఐగా సుదీర్ఘకాలం పాటు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల పదోన్నతి పొందిన ఆయనను ఉన్నతాధికారు లు చింతపల్లి సబ్ డివిజన్ డీఎస్పీగా నియమించారు. విధుల్లో చేరిన ఆయనను చింతపల్లి ప్రెస్ క్లబ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దేశెట్టి సత్యనారాయణ (సతీష్) ఆధ్వర్యంలో పలువురు పాత్రికేయులు నూతన డీఎస్పీని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రకృతి రమణీయమైన మన్యం ప్రాంతంలో విధులు నిర్వహించే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేసేందుకు ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’కు అధిక ప్రాధాన్యం ఇస్తామని, అదే సమయంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.సమాజంలో చట్టబద్ధమైన పాలనను, శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసు వ్యవస్థ ఎంత అవసరమో.. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పత్రికా రంగం పాత్ర కూడా అంతే ముఖ్యమన్నారు. ఈ రెండు వ్యవస్థలు పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే సమాజం మరింత సురక్షితంగా, ప్రశాంతంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏజెన్సీలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు మీడియా మిత్రులు పోలీసు శాఖకు సహకారం అందించాలని డీఎస్పీ కోరారు.
