జగ్గంపేట, ఆగస్టు 4: జగ్గంపేట నియోజకవర్గంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా రెండు సంవత్సరాల క్రితం హాస్టల్ను తాత్కాలికంగా మరో ప్రాంతానికి తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత హాస్టల్ ఉన్న ప్రభుత్వ స్థలంలోనే నూతన హాస్టల్ భవనాన్ని నిర్మించాలని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కాకినాడ జిల్లా అడ్వైజర్ జుత్తుక నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. పాత హాస్టల్ స్థలం విద్యార్థులకు అనువైన ప్రాంతంలో ఉండటంతో పాటు ప్రభుత్వానికి ఇప్పటికే అందుబాటులో ఉన్న భూమి కావడం వల్ల అదే స్థలంలో ఆధునిక సౌకర్యాలతో కొత్త భవనాన్ని నిర్మిస్తే విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించవచ్చని ఆయన అన్నారు.ఎస్సీ బాయ్స్ హాస్టల్ నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాత హాస్టల్ స్థలాన్ని వదిలి మరో ప్రాంతంలో భవనం నిర్మించేందుకు కూటమి ప్రభుత్వ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.జగ్గంపేట నడిబొడ్డున దళిత విద్యార్థుల హాస్టల్ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ చర్యలు జరుగుతున్నాయని నాగేశ్వరరావు విమర్శించారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పాత హాస్టల్ స్థలంలోనే ఆధునిక సౌకర్యాలతో నూతన ఎస్సీ బాయ్స్ హాస్టల్ భవన నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలని ప్రభుత్వం, సంబంధిత అధికారులను ఆయన డిమాండ్ చేశారు.

