కిర్లంపూడి, ఆగస్టు 11: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోదిరెడ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించే కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కృష్ణవరం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గ్రామంలో రహదారులు, తాగునీరు, సాగునీరు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా గ్రామ ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందన్నారు.విద్యార్థులకు ‘తల్లికి వందనం’, వృద్ధులు, వితంతువులు తదితరులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, ఆటో డ్రైవర్లకు ‘ఆటో డ్రైవర్ సేవలో’, రైతులకు ‘అన్నదాత సుఖీభవ’, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల ద్వారా లబ్ధి చేకూరుతోందని వివరించారు.చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారంపై చూపుతున్న చిత్తశుద్ధితో గ్రామాలకు అభివృద్ధి నిధులు అందుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి నిధులను వినియోగిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్, వీరం రెడ్డి కాశిబాబు, తోట రవి, కొత్త కొండబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, తోట గాంధీ, చదరం చంటిబాబు, కంచుమర్తి రాఘవ, యడల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


