పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధి కొరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు కార్యాలయంలో కచ్చితంగా 5 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉండాలని కలెక్టర్ కె దినేష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు, సమస్యలను స్వీకరించి సత్వర పరిష్కారం అందించేందుకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో పనిచేస్తున్న అన్ని శాఖల సిబ్బంది ప్రతి పని దినం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలియ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు మేరకు క్షేత్ర స్థాయిలో అధికారులు ఆమేరకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకే అందించడంతో పాటు వారి సమస్యలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించేందుకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలు కీలకంగా పనిచేస్తున్నాయని కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. అయితే కొన్ని కార్యాలయాల్లో వ్యవసాయ, సర్వే, రెవెన్యూ, వైద్య, ఇంజినీరింగ్ తదితర విభాగాలకు చెందిన సిబ్బంది కార్యాలయ సమయాల్లో క్షేత్రస్థాయి విధుల్లో ఉండటంతో ప్రజలకు అందుబాటులో లేకపోతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు ఆయన తెలిపారు. పి జి ఆర్ ఎస్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ( పి జి ఆర్ ఎస్)ను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా, ప్రతి పని దినం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు సిబ్బంది కార్యాలయాల్లో ఉండి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పౌరులు ఈ సమయాన్ని వినియోగించుకుని తమ సమస్యలను సంబంధిత సిబ్బందికి నేరుగా తెలియజేయవచ్చన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ప్రభుత్వంపై సానుకూల విశ్వాసాన్ని పెంపొందించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. డిప్యుటేషన్పై ఇతర శాఖలు లేదా ప్రాంతాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఈ ఆదేశాలు వర్తించవని స్పష్టం చేశారు.
