జగ్గంపేట, ఆగస్టు 10: జగ్గంపేట జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 21 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి జగ్గంపేట ఎస్ఐ టి. రఘునాథరావు తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గంపేట మండలం రాజపూడి గ్రామానికి చెందిన గాది కనకదుర్గకు ఇద్దరు కుమారులు ఉన్నారు. సుమారు ఐదేళ్ల క్రితం ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామ పరిధిలోని తోట పెద్దకాపు ప్రాంతంలో పొలాన్ని లీజుకు తీసుకుని మొక్కలు పెంచుతూ నర్సరీ నిర్వహిస్తున్నారు. కనకదుర్గ తన చిన్న కుమారుడు గాది మణికంఠ (21)తో కలిసి అక్కడే ఉంటున్నారు. సోమవారం బ్యాంకు పనిమీద కనకదుర్గ ఎర్రవరం నుంచి బస్సులో జగ్గంపేటకు వచ్చింది. బ్యాంకులో చెల్లించాల్సిన డబ్బులు తీసుకురావడం మరిచిపోయినట్లు గుర్తించి, తన చిన్న కుమారుడు మణికంఠకు ఫోన్ చేసి డబ్బులు తీసుకుని జగ్గంపేటకు రావాలని చెప్పింది.
దీంతో మణికంఠ డబ్బులు తీసుకుని మోటార్సైకిల్పై ఎర్రవరం నుంచి జగ్గంపేట బయలుదేరాడు. జగ్గంపేట జాతీయ రహదారిపై చర్చి సమీపంలో బైక్ వేగాన్ని నియంత్రించలేక ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన మణికంఠ అక్కడికక్కడే మృతి చెందాడు. మణికంఠ బైక్ ముందుకు జారుకుంటూ వెళ్లడంతో ముందుగా సైకిల్ పై వెళ్తున్న రామవరం గ్రామానికి చెందిన కోలా శ్రీనుకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనపై మృతుడి తల్లి కనకదుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ టి. రఘునాథరావు తెలిపారు.


