జగ్గంపేట, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు జగ్గంపేటలో అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని పాత ఎస్సీ హాస్టల్లో జరిగిన ఈ కార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ (BSP) కాకినాడ జిల్లా అడ్వైజర్ మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ జుత్తుక నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట సీఐ బి. తిరుపతిరావు ముఖ్య అతిథిగా హాజరై, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందినవారు కాదని, ఆయన ప్రపంచం గర్వించదగ్గ గొప్ప మేధావి అని కొనియాడారు.భారతదేశానికి ఆయన చేసిన సేవలు అనన్యసామాన్యమని, విద్యార్థులు అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంఅనంతరం హాస్టల్ వార్డెన్ ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ జయంతిని ఒక పండుగలా జరుపుకుంటారని, ఇటువంటి గుర్తింపు మరే నాయకుడికి లేదని పేర్కొన్నారు. ప్రొఫెసర్ బోయిడి సూరిబాబు మాట్లాడుతూ, బాబా సాహెబ్ అంబేద్కర్ చూపిన ఆలోచనా విధానంలో మనందరం నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం హాజరైన వారందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో ఎలక్ట్రికల్ ఏఈ మాధురి, హాస్టల్ వార్డెన్ పెట్టా ప్రభాకర్, బాలికల హాస్టల్ వార్డెన్ రోజా, ప్రొఫెసర్ డాక్టర్ బి. సూరిబాబు, దళిత ప్రజాశక్తి అధ్యక్షులు మురారి రవికుమార్, క్రిస్టియన్ మైనారిటీ సభ్యులు జాన్ వెస్లీ, సామాజిక నాయకుడు వల్లూరి సత్యానందం పాల్గొన్నారు. అలాగే టీడీపీ నాయకులు మూరా సత్తిబాబు, కలవల అబ్బులు, సలాది డేవిడ్ రాజు, సబ్బి శ్రీను తదితర నాయకులు, కార్యకర్తలు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.


