జిల్లా వాణి ప్రతినిధి: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలోని ఏలేరు నది తీరాన వెలసిన పుణ్యక్షేత్రం భక్తి చైతన్యంతో పులకించింది. ఇర్రిపాక శివ కేశవుల క్షేత్రంలో ఫిబ్రవరి 7 నుండి 9 వరకు మూడు రోజుల పాటు జరుగుతున్న దైవ కార్యక్రమాల్లో భాగంగా, రెండో రోజు ఆదివారం నాడు శ్రీరామ సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రత మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జ్యోతుల నవీన్, తోట సర్వారాయుడు దంపతులు స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మణి దంపతుల పర్యవేక్షణలో, అన్నవరం దేవస్థానం వారి సహకారంతో ఈ వ్రత మహోత్సవం జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమ పూజా పీఠంపై కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ – లక్ష్మీదేవి దంపతులు, అలాగే ఎమ్మెల్యే కుమార్తె తోట సునీత – సర్వారాయుడు దంపతులు కూర్చుని శాస్త్రోక్తంగా వ్రతాన్ని ఆచరించారు. ఈ సామూహిక వ్రత మహోత్సవంలో నియోజకవర్గం నలుమూలల నుండి సుమారు 700 జంటలు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. “ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సాయంత్రం వేళ శ్రీ రామ సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నాం,” అని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కూటమి నాయకులు, అన్నవరం దేవస్థానం వేద పండితులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని శివ కేశవుల దర్శనం చేసుకున్నారు.



కళ్యాణమహోత్సవ కోసం చాలా మంది వస్తున్నారు బ్రో