ఆర్యవైశ్యులు సంకల్పిస్తే ఏదైనా సాధ్యమవుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కోనసీమ తిరుమలగా పేరు గాంచిన వాడపల్లిలో ఆర్యవైశ్య నిత్యాన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆర్యవైశ్య కళ్యాణమండపం, అన్నదాన హాల్, డార్మిటరీలు, 90గదుల నిర్మాణానికి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడ పుణ్యక్షేత్రాలున్నా ఆర్యవైశ్యులు సేవా కార్యక్రమాల్లో ముందుండడం విశేషమన్నారు. వాడపల్లి క్షేత్రం రోజురోజుకూ అభివృద్ధి చెందుతూ మరో తిరుమలగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. ఆర్యవైశ్య ప్రముఖులు ఏకమై ఇలాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు.
ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న కళ్యాణమండపంతో పాటు 700 మంది సామర్థ్యంతో డార్మిటరీ, అన్నదాన హాల్, 90 గదులు నిర్మించనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా భక్తులకు మరిన్ని సౌకర్యాలు కలుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
త్వరలో ప్రభుత్వం తరపున కూడా డార్మిటరీలు, గదుల నిర్మాణానికి శంకుస్థాపన జరగనుందని తెలిపారు. వచ్చే పుష్కరాల నాటికి ఈ నిర్మాణాలు పూర్తికావాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రసాద్ పథకం కింద వాడపల్లి అభివృద్ధికి కృషి చేస్తున్నామని వివరించారు.
ఈకార్యక్రమంలో జనసేన ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్, అనపర్తి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఆకుల రామకృష్ణ, బీజేపీ నాయకులు తమలంపూడి రామకృష్ణారెడ్డి, పాలూరి సత్యానందం, ఆర్యవైశ్య ప్రముఖులు శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.
వాడపల్లిలో రూ.25 కోట్లతో ఆర్యవైశ్య కళ్యాణమండపానికి శంకుస్థాపన ఆర్య వైశ్యులు సంకల్పిస్తే ఏదైనా సాధ్యమే ఎమ్మెల్యే బండారు
RELATED ARTICLES
