జగ్గంపేట, ఏప్రియల్:5 (జిల్లా వాణి ప్రతినిధి): కాకినాడ జిల్లా జగ్గంపేటలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో సీఐ టి. తిరుపతిరావు, ఎస్సై టి. రఘునాథరావు తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రహదారిపై వెళ్తున్న వాహనదారులను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, బ్రీత్ అనలైజర్ల ద్వారా మద్యం సేవించిన వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ తిరుపతిరావు గారు వాహనదారులకు పలు కీలక సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది ప్రమాద సమయాల్లో ప్రాణాలకు రక్షణ కవచంలా పనిచేస్తుందని వివరించారు. రోడ్ల పక్కన, నిర్మానుష్య ప్రాంతాల్లో మద్యం సేవించి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని, పదే పదే తప్పు చేస్తే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. శాంతి భద్రతల కోసం ప్రత్యేక నిఘా ప్రజల రక్షణ కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని, ప్రతి ఒక్కరూ పోలీసు యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక బృందాలతో తనిఖీలు కొనసాగుతాయని, వెల్లడించారు. పోలీసుల ఈ మెరుపు దాడులతో నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల్లోనూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిలోనూ ఒక్కసారిగా గుబులు మొదలైంది.

