అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్ రోలుగుంట మండలం కొంతలం గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా PMDS (30 రకాల విత్తనాల పద్ధతి) పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సీహెచ్ లచ్చన్న, మండల వ్యవసాయ అధికారి సీహెచ్ చిరంజీవి ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది వి.ఏ.ఏ గాలి ఉమా నిర్వహించారు. సాయిబాబా బయో రిసోర్స్ సెంటర్ (BRC) ద్వారా ఇన్పుట్ మరియు అవుట్పుట్ కార్యకలాపాలను వివరించారు.
ఈ సందర్భంగా PMDS పద్ధతి ప్రయోజనాలను అధికారులు వివరించారు. ఈ పద్ధతితో సంవత్సరమంతా నేల పచ్చదనంతో కప్పబడి ఉండి నిరంతర ఆదాయానికి దోహదపడుతుందని తెలిపారు. నేల సారవంతం పెరగడం, సూక్ష్మజీవుల వృద్ధి, వానపాముల పెరుగుదల వంటి మార్పులు చోటుచేసుకుని ప్రధాన పంటకు అవసరమైన పోషకాలు సహజంగా లభిస్తాయని చెప్పారు.
అలాగే నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరగడం, పలు పంటల సాగుతో అదనపు ఆదాయం రావడం, పశువులకు పోషకాహార మేత లభించడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. జీవవైవిధ్యం పెరగడం, నేలలో కార్బన్ శాతం అధికమవడం, రసాయన ఎరువుల వినియోగం తగ్గడం ద్వారా దిగుబడులు పెరగడంతో పాటు వాతావరణ మార్పులకు తట్టుకునే సామర్థ్యం కూడా పెరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జ్ యర్రంశెట్టి నిర్మల, ICRP సభ్యులు బొబ్బిలి సాంబమూర్తి, చందనాడ సాయిలక్ష్మి, గూడెపు సుజాత, కేసరపూడి శివ, వ్యాచలపురం బాబు, కె. నూకలమ్మ, వై. పూర్ణిమ, వై. రాజుబాబు, నాగకాంతమ్మ, శివలలిత కుమారి, బి. స్వాతి, యు. గీతాంజలి, దుర్గ, గంగా భవాని తదితరులు పాల్గొన్నారు.
గ్రామ సర్పంచ్ కొంచంగి హరిబాబు, ఎంపీటీసీ బంటు నానాజీ, ఉడి సత్తిబాబు, సాసుబెల్లి సత్యనారాయణతో పాటు మహిళా రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కొంతలంలో పీఎండీఎస్ పద్ధతి ప్రదర్శన రైతులకు అవగాహన సదస్సు.
RELATED ARTICLES
