రామవరం (జగ్గంపేట):శ్రీ శ్రీశ్రీ భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 23న (వైశాఖ శుద్ధ సప్తమి) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా సగరులందరూ ఏకమై వేడుకలను జయప్రదం చేయాలని జిల్లా సగర సంఘం పిలుపునిచ్చింది. గురువారం సాయంత్రం రామవరం గ్రామంలో జిల్లా అధ్యక్షులు గుర్ర మహాలక్ష్మి అధ్యక్షతన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.సమావేశంలో జయంతి సందర్భంగా జగ్గంపేటలో భారీ ర్యాలీ మరియు బహిరంగ సభను నిర్వహించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. మహర్షి జయంతిని కేవలం ఉత్సవంగానే కాకుండా అన్నదానాలు, మజ్జిగ పంపిణీ వంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సగర వంశ మూలపురుషుడైన భగీరథ మహర్షి చరిత్రను, ఆయన చేసిన త్యాగాన్ని సమాజంలోని అందరికీ తెలిసేలా కార్యక్రమాలు రూపొందించాలని నేతలు ఆకాంక్షించారు. స్థానిక ప్రజాప్రతినిధులను ఈ వేడుకల్లో భాగస్వాములను చేస్తూ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఘనంగా నిర్వహించాలని చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నక్క కిషోర్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఏపూరి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నాటి అప్పలస్వామి, ఉప ప్రధాన కార్యదర్శి నక్క శ్రీనివాసరావు, సగర ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు గారపాటి ఏడుకొండలు, యువజన ప్రధాన కార్యదర్శి ములికి రాజన్న మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, సగర సామాజిక వర్గ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

