కూటమి ప్రభుత్వ హయంలో చింతలూరు నూకాలమ్మ ఆలయ అభివృద్ధి వేగవంతం….
ఆలయంలో రూ.1.18 కోట్లతో నిర్మించిన రెండు రాజగోపురాలతో పాటు, వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు….
జాతరకు వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలి…
సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు…
ఉభయగోదావరి జిల్లాలో అత్యంత ప్రముఖమైన చింతలూరు నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశించారు. శుక్రవారం దేవస్థానంలో నూతనంగా నిర్మించిన రాజగోపురాలు, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, దేవస్థాన ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కొత్తపేట జనసేన ఇన్చార్జ్ బండారు శ్రీనివాసరావు తదితరులతో కలిసి పాల్గొన్నారు. మొదటగా దాతల సహకారంతో రూ.80 లక్షల నిధులతో నిర్మించిన తూర్పు, పడమర రాజగోపురాలను, రూ.5లక్షల దేవస్థానం నిధులతో నిర్మించిన 5 షెడ్లను, రూ.9 లక్షల దేవస్థానం నిధులతో కొనుగోలు చేసిన జనరేటర్ ను, రూ.24 లక్షలతో స్వచ్చ భారత్ స్కీము ద్వారా నిర్మించిన 24 టాయిలెట్స్ ను ఎమ్మెల్యే బండారు ప్రారంభించారు. అనంతరం సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలూరు నూకాలమ్మ ఆలయంలో దేవస్థానం నిధులు, దాతల సహకారంతో గత రెండేళ్లలో అద్వితీయమైన అభివృద్ధి జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా దాతల సేవలను కొనియాడారు. ఈ మధ్య ఆలయంలో నూతనంగా తీసుకుని వచ్చిన నెల రోజులు పాటల ద్వారా రూ.70 లక్షల వరకూ ఆదాయం దేవస్థానానికి లభించిందని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. మరీ ముఖ్యంగా భక్తులకు క్యూలైన్లు, త్రాగునీటి ఏర్పాట్లు పటిష్టంగా చేయాలన్నారు. శానిటేషన్ విషయంలో శ్రద్ధ చూపించాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దర్శనం సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.అనంతరం నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించరు,రచయిత సూర్య ఆకుల అమ్మవారిపై రచించి, వీడియో గా రూపొందించిన గీతాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
