సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడి గ్రోయన్ల నిర్మాణానికి కృషి…
రాజవరంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు….
ఆత్రేయపురం మండలం రాజవరంలో గోదావరి నదీ కోతకు గురవుతున్న లంక పొలాలను శుక్రవారం ఎమ్మెల్యే బండారు పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్య పూర్వాపరాలను తెలుసుకున్నారు. గతంలో ఇక్కడ మట్టి తవ్వకాలు జరగడం వల్ల నేల వదులై పొలాలన్నీ కోతకు గురవుతున్నాయని రైతులు ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల విలువచేసే భూములు గోదావరిలో కలిసిపోతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నదీ కోతను అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. గ్రోయిన్ల నిర్మాణానికి రూ.38 కోట్లు 50 లక్షలు అవసరమవుతాయని అధికారులు తెలిపారు. ఈ అంశాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతిపాదనలు ఆమోదం పొందగానే గ్రోయన్ల నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బండారు తెలిపారు.
