జగ్గంపేట, మార్చి 23 (జిల్లా వాణి ప్రతినిధి): భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అతి చిన్న వయసులోనే దేశం కోసం, ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన వీర మరణం పొందిన సర్దార్ భగత్ సింగ్ నేటి యువతరానికి గొప్ప పోరాట స్ఫూర్తి అని పలువురు నాయకులు కొనియాడారు. సోమవారం భగత్ సింగ్ 95వ వర్ధంతిని పురస్కరించుకుని జగ్గంపేట శివారులోని భగత్ సింగ్ నగర్ కాలనీలో సిపిఐ (ML) న్యూ డెమోక్రసీ, అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) కమిటీల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు ఎం. యేసు, గంటా బాలరాజు మాట్లాడుతూ..భారతదేశానికి మతోన్మాదం వల్ల పెను ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి కాలంలోనే మతోన్మాదులకు వ్యతిరేకంగా భగత్ సింగ్ ప్రదర్శించిన పోరాట పటిమ నేటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశ సమగ్రతను దెబ్బతీసే శక్తులకు వ్యతిరేకంగా యువత ఏకమై ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. భగత్ సింగ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కోరారు.పాల్గొన్న ముఖ్యులు:ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు దార్ల వీరభద్ర రావు, గుర్రాల దుర్గాప్రసాద్, సబ్బవరపు రాజబాబు, నక్క గంగ, జి. మనీ, దేవరకొండ కుమారి, రాగాల పాప, జి. గోవిందమ్మ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

