జగ్గంపేటలో భగత్ సింగ్ 95వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
జగ్గంపేట, మార్చి 23(జిల్లా వాణి ప్రతినిధి):భారతదేశ స్వాతంత్య్రం కోసం అలుపెరగని పోరాటం చేసి, అతి చిన్న వయసులోనే ఉరికంభమెక్కిన విప్లవ వీరుడు షహీద్ భగత్ సింగ్ ఆశయాలను యువత పుణికిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు పిలుపునిచ్చారు. సోమవారం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామపంచాయతీ పరిధిలోని రంగవల్లి నగర్లో భగత్ సింగ్ 95వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వీరాంజనేయులు మాట్లాడుతూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. భారతదేశ ప్రజలకు బ్రిటిష్ పాలన నుండి విముక్తి కలగాలని, ప్రజలు ఎటువంటి దోపిడీకి గురికాకూడదని భగత్ సింగ్ ఆకాంక్షించారని ఆయన కొనియాడారు. 23 ఏళ్లకే మరణాన్ని ధైర్యంగా ముద్దాడటం భారతదేశం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలపై స్పందిస్తూ.. అమెరికా సామ్రాజ్యవాద ధోరణి నశించాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్ – అమెరికా దేశాలు కలిసి ఇరాన్పై జరుపుతున్న అధర్మ యుద్ధాలను తక్షణమే నిలిపివేయాలని కోరారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వంటి వీరులు దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని, కానీ నేటి యువత కుల, మత వైషమ్యాలకు మరియు మత్తు పదార్థాలకు బానిసలై మార్గతప్పడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు డాన్ శ్రీను, సోమరాజు, లక్ష్మి, ఆంధ్ర, లోవరాజు తదితరులు పాల్గొని అమరవీరుల పోరాట స్ఫూర్తిని కొనియాడారు.

