జగ్గంపేట, మార్చి 24 (జిల్లా వాణి ప్రతినిధి): స్థానిక శ్రీ ప్రజ్ఞ విద్యా సంస్థల్లో మంగళవారం ‘గ్రాడ్యుయేషన్ డే’ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. సంస్థ చైర్మన్ బండారు నాగబాబు, డైరెక్టర్ తుమ్మల శ్వేత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పట్టాల ప్రధానం చేశారు. యూకేజీ పూర్తి చేసుకుని ప్రాథమిక విద్యలోకి, అలాగే 5వ తరగతి పూర్తి చేసి ఉన్నత విద్యలోకి అడుగుపెడుతున్న చిన్నారులకు విద్యా సంస్థల తరపున గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రాడ్యుయేషన్ గౌన్లు, టోపీలు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమ విద్యా జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కిన ఆనందం చిన్నారుల ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. చిన్నారుల ప్రతిభను అభినందిస్తూ, వారి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని చైర్మన్ నాగబాబు మరియు డైరెక్టర్ శ్వేత ఆకాంక్షించారు. క్రమశిక్షణతో కూడిన విద్యే విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కె. అభి (కాలేజ్ ప్రిన్సిపాల్) అడపా సాయి దీప్తి (హై స్కూల్ ప్రిన్సిపాల్) తోట నాగలక్ష్మి (ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్) కొల్లా శ్రీనివాస్ (ఇంచార్జ్) బాలిన అరుణ దేవి, శ్రావణి, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

