ఘనంగా సర్పంచుల పదవీ విరమణ సన్మాన కార్యక్రమం
కిర్లంపూడి, మార్చి 28(జిల్లా వాణి ప్రతినిధి): “దేశానికి రాష్ట్రపతి ఎలాగో.. గ్రామానికి సర్పంచ్ అలా ప్రథమ పౌరుడు” అని కిర్లంపూడి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు (ఎంపీపీ) తోట రవి కొనియాడారు. శనివారం కిర్లంపూడి మండల కేంద్రంలో ఆయన అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం అత్యంత ఉత్సాహంగా జరిగింది. అభివృద్ధి పనులపై సమీక్ష ఈ సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే ఏప్రిల్ నెలకు సంబంధించి గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై ప్రణాళికలు రూపొందించి, పలు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.సర్పంచులకు ఘన సన్మానంఐదేళ్ల పదవీ కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులకు ఈ సందర్భంగా ఘనంగా సన్మానం నిర్వహించారు. ఎంపీపీ తోట రవి, మండల అభివృద్ధి అధికారి (MPDO) హరికృష్ణల ఆధ్వర్యంలో సర్పంచులను శాలువాలతో కప్పి, పూలమాలలతో సత్కరించారు. అనంతరం వారికి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ తోట రవి మాట్లాడుతూ “గత ఐదేళ్లుగా ప్రజా సమస్యల పరిష్కారంలోనూ, గ్రామాల అభివృద్ధిలోనూ సర్పంచులు కీలక పాత్ర పోషించారు. నిరంతరం ప్రజల చెంత ఉంటూ గ్రామాలను ప్రగతి పథంలో నడిపించిన ప్రతి ఒక్క సర్పంచ్ అభినందనీయుడు వీరు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటున్నాను.” తమకు సహకరించిన అధికారులకు, తోటి నాయకులకు సర్పంచులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరంరెడ్డి కాశిబాబు, తోట గాంధీ, చదరం చంటిబాబు, తూము కుమార్, గుడాల రాంబాబు, కాళ్ల వెంకటేష్, గోడే బాల, అల్లు శివరామకృష్ణ, గోకాడ రాజా, బొజ్జపు శ్రీనుతో పాటు అధిక సంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీలు మరియు మండల అధికారులు పాల్గొన్నారు.

