జగ్గంపేట, ఏప్రిల్ 16: కాకినాడ జిల్లాలో అత్యంత రద్దీగా ఉండే కేంద్రాల్లో ఒకటైన జగ్గంపేట బస్టాండ్లో ప్రయాణికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఈ బస్టాండ్లో కనీస సౌకర్యమైన తాగునీరు కరువవ్వడంపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అపరిశుభ్రతే నిలయం బస్టాండ్లో తాగునీటి కోసం ఏర్పాటు చేసిన పైపులైన్లు నిర్వహణ లేక అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. నీటి పైపుల చుట్టూ నాచు పట్టి, దుర్వాసన వస్తుండటంతో ప్రయాణికులు ఆ నీటిని తాగేందుకు జంకుతున్నారు. వేసవి కాలం కావడంతో ఎండల తీవ్రత దృష్ట్యా మంచినీరు తప్పనిసరి అయినప్పటికీ, అధికారులు మాత్రం దీనిపై దృష్టి సారించడం లేదు. అద్దెలపై ఉన్న శ్రద్ధ.. సౌకర్యాలపై లేదా?బస్టాండ్ ఆవరణలోని దుకాణాల ద్వారా ఆర్టీసీ యాజమాన్యం నెలకు వేలాది రూపాయల అద్దెలు వసూలు చేస్తోంది. ఆదాయంపై చూపిస్తున్న శ్రద్ధలో కనీసం వంతైనా ప్రయాణికుల కనీస అవసరాలైన మంచినీరు, పారిశుధ్యంపై చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. లక్షల రూపాయల ఆదాయం వస్తున్నా, ప్రయాణికులకు గుక్కెడు మంచినీరు అందించలేకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఎండలు ముదురుతున్న నేపథ్యంలో, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. వెంటనే నాచు పట్టిన పైపులను శుభ్రం చేయించాలి. ప్రయాణికుల కోసం స్వచ్ఛమైన మంచినీటి చలివేంద్రాన్ని లేదా వాటర్ ప్లాంట్ను అందుబాటులోకి తేవాలి. బస్టాండ్ ఆవరణలో పారిశుధ్య పనులను పర్యవేక్షించాలి. ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి ప్రయాణికుల ఇబ్బందులను తొలగిస్తుందో లేదో వేచి చూడాలి.


