కిర్లంపూడి, ఏప్రిల్ 10 (జిల్లా వాణి ప్రతినిధి): పోలీసు అంటే కేవలం లాఠీ పట్టుకుని భయపెట్టేవారు మాత్రమే కాదు, ఆపదలో అండగా ఉంటూ అవగాహన కల్పించే ఆప్తమిత్రుడు అని నిరూపిస్తున్నారు కిర్లంపూడి ఎస్సై జి. సతీష్ కుమార్. ఫ్రెండ్లీ పోలీసింగ్కు నిలువెత్తు రూపంగా నిలుస్తున్న ఆయన, తాజాగా జగపతినగరంలో ఉపాధి హామీ కూలీలతో మమేకమైన తీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది. కూలీలతో కలిసి కింద కూర్చుని..జగపతినగరంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లిన ఎస్సై సతీష్ కుమార్, కూలీలతో కలిసి నేలపై కూర్చుని వారితో ముచ్చటించారు. ఎటువంటి భేషజాలు లేకుండా సామాన్యుడిలా వారితో కలిసిపోయి పలు అంశాలపై అవగాహన కల్పించడం అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంది. పిల్లల ప్రవర్తనపై నిఘా ప్రస్తుత సమాజంలో మారుతున్న పరిస్థితుల తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, వారి భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయని ఆయన హెచ్చరించారు. అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్ లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత వివరాలను ఎవరికీ పంచుకోవద్దని వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది ప్రమాద సమయంలో ప్రాణరక్షక కవచంలా పనిచేస్తుందని కూలీలకు అవగాహన కల్పించారు.ఖాకీ దుస్తుల్లో ఉన్నా, సామాన్యుల కష్టసుఖాలను వింటూ వారికి భద్రతా నియమాలను వివరించిన ఎస్సై సతీష్ కుమార్ తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

