జగ్గంపేట: కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఇంధన కొరత తీవ్ర రూపం దాల్చింది. గత కొన్ని రోజులుగా స్థానిక పెట్రోల్ బంకుల్లో డీజిల్ నిల్వలు నిండుకోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయే పరిస్థితి నెలకొంది. పెట్రోల్కు కూడా భారీగా డిమాండ్ పెరగడంతో వాహనదారులు బంకుల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
స్తంభిస్తున్న రవాణా వ్యవస్థ
జగ్గంపేట పరిసర ప్రాంతాల్లోని ప్రధాన ఆయిల్ బంకుల్లో ‘డీజిల్ నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీనివల్ల లారీలు, ఇతర భారీ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇదే పరిస్థితి మరో రెండు రోజులు కొనసాగితే నిత్యావసర వస్తువుల రవాణా నిలిచిపోయి, మార్కెట్లో ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బారులు తీరుతున్న వాహనదారులు
కేవలం డీజిల్ మాత్రమే కాకుండా, పెట్రోల్ కొరత కూడా వేధిస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి.
”ప్రభుత్వం బయట పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. గంటల తరబడి వేచి చూసినా ఇంధనం దొరకడం లేదు,” అని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జి డిమాండ్
ప్రజలు పడుతున్న ఈ ఇబ్బందులపై బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జి జుత్తుక నాగేశ్వరరావు స్పందించారు. ప్రభుత్వ ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని ఆయన విమర్శించారు. తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని, ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సామాన్యుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు

