*వైద్య సేవలు, సౌకర్యాలపై డాక్టర్ కే. మహేష్ సంతృప్తి*
గండేపల్లి, ఫిబ్రవరి 19 (జిల్లా వాణి ప్రతినిధి):
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జెడ్.రాగంపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (CHC) జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయకర్త (DCHS) డాక్టర్ కే. మహేష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వైద్య పరికరాలు, రోగులకు అందుతున్న సేవలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య పరికరాలను పరిశీలించిన ఆయన, చికిత్సకు అవసరమైన అన్ని ఎక్విప్మెంట్ సిద్ధంగా ఉన్నాయని ధృవీకరించారు. ముఖ్యంగా రక్త పరీక్షలు నిర్వహించే విభాగాలను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో డాక్టర్ మహేష్ నేరుగా మాట్లాడారు. వారికి అందుతున్న సౌకర్యాలు, వైద్యుల పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, రోగుల వివరాలు మరియు వైద్య సేవల నమోదుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ద్వారా అందుతున్న ఉచిత మందుల పంపిణీ తీరును మరియు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందుతున్న సేవల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్ మహేష్, ఆసుపత్రి నిర్వహణ బాగుందని, వైద్యులు అందిస్తున్న సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని, ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో ఎటువంటి అలసత్వం వహించకూడదని సిబ్బందికి సూచించారు.

