జగ్గంపేట: గత 20 ఏళ్లుగా జగ్గంపేట నియోజకవర్గాన్ని పాలించిన ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి సుమారు వెయ్యి కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకున్నారని జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరోతి శివగణేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక టౌన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాజీ మరియు ప్రస్తుత ఎమ్మెల్యేలపై అవినీతి చిట్టాను విడుదల చేశారు. అవినీతి అక్రమాలపై ఈ సందర్భంగా శివగణేష్ మాట్లాడుతూ, గత రెండు దశాబ్దాలుగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన తోట నరసింహం, జ్యోతుల చంటిబాబు, మరియు జ్యోతుల నెహ్రూలు నియోజకవర్గాన్ని ఏటీఎంలా వాడుకున్నారని విమర్శించారు. గుమ్మలదొడ్డిలోని అస్సాగో కాలుష్య పరిశ్రమ, దేవి ఫిషరీస్, రాజ్యలక్ష్మి మెరైన్స్ వంటి సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారని ఆరోపించారు. ఎల్లమెల్లి గ్రామంలో జెట్టి గ్రానైట్స్ వారు హై ఫ్రీక్వెన్సీ బ్లాస్టింగ్ జరపడం వల్ల వేల సంఖ్యలో బోరు బావులు పూడిపోయాయని, దీని వెనుక ఎమ్మెల్యేల హస్తం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఇళ్ల స్థలాల సేకరణలో సగానికి సగం కమిషన్లు తీసుకోవడం, వాసుదేవ నగర్ ప్రభుత్వ భూమి కబ్జా, కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయించిన 6 ఎకరాల భూమి అపహరణ వంటి ఘోరాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఇసుక, మట్టి అక్రమ రవాణా, రేషన్ బియ్యం మాఫియా, పెట్రోల్ బంకుల వద్ద వసూళ్లు, ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లలో ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుండి రూ. 10 లక్షల చొప్పున వసూలు చేశారని శివగణేష్ వివరించారు. దేవుడి సాక్షిగా ప్రమాణం చేయగలరా? – శివగణేష్ సవాల్. “ఈ ముగ్గురు నేతలు తాము నిప్పు అని చెప్పుకుంటుంటే.. తమ బిడ్డల సాక్షిగా, తమకు నచ్చిన దైవం సన్నిధిలో ప్రమాణం చేయాలి” అని శివగణేష్ సవాల్ విసిరారు. అస్సాగో, దేవి ఫిషరీస్, జెట్టి గ్రానైట్స్ వంటి సంస్థల నుండి తాము ఎటువంటి ఆర్థిక లబ్ధి పొందలేదని ప్రమాణం చేయలేకపోతే, వారు అవినీతికి పాల్పడినట్లేనని ప్రజలు భావిస్తారని ఆయన అన్నారు. గత 20 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల పక్షాన పోరాడుతున్న తనకు, నియోజకవర్గ పౌరులందరూ నెలకు రూ. 100 గౌరవ వేతనం అందించి ఆశీర్వదించాలని ఆయన కోరారు. తనను చట్టసభలకు పంపే వరకు ఈ మద్దతు తెలపాలని, ఆసక్తి గల వారు 996365589 నంబర్కు ఫోన్ పే చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు వత్సవాయి సత్యనారాయణ రాజు (బాబు), పిసిసి జనరల్ సెక్రెటరీ డాక్టర్ నక్క సత్యనారాయణ, గండేపల్లి మండల అధ్యక్షుడు నేదురి భాస్కరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు నకిరెడ్డి విష్ణు చక్రం, ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీ జోడ చైతన్యకుమార్, యూత్ కాంగ్రెస్ నేత ఏగుపాటి మహేష్ కుమార్ మరియు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

